కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో భారత్ అనేక దేశాలను ఆదుకుంటోంది. మహమ్మారి బారి నుంచి తనను తాను కాపాడుకుంటూనే ఆపదలో ఉన్న దేశాలకు తనవంతు సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అమెరికాతోపాటు పలు అగ్రరాజ్యాలకు కూడా హైడ్రాక్లోరోక్విన్ మాత్రలను అందించి తన పెద్దమనసును చాటుకున్న భారత్ తాజాగా.. యూకేకు సుమారు 30లక్షల పారసెటమల్ ట్యాబ్లెట్స్ను కూడా అందించేందుకు అంగీకరించింది. దీంతో భారత్కు బోరిస్ జాన్సన్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. యూకేలో మందుల కొరత ఉన్న సమయంలో భారత్ అందించిన సాయం మరువలేనిదని పేర్కొంది. కరోనా బాధితులకు చికిత్స చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంది.
భారత్ అందిస్తున్న ఈ పారాసెటమాల్ ట్యాబ్లెట్లను ఆదేశ షాపుల్లో అందుబాటులో ఉంచనున్నారు. కరోనా లక్షణాల్లో ఒకటైన జ్వరం తగ్గేందుకు ఈ ట్యాబ్లెట్లను వినియోగించనున్నారు. కాగా, యూకేలో కూడా కరోనాన వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే 93,873 మందికిపైగా కరోనా బారిన పడ్డారు. సుమారు 12,107 మంది మరణించారు. ఏకంగా ఆదేప్రధాని బోరిస్ జాన్సన్ కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు.