తమిళనాడులో కరోనా కలకలం రేపుతోంది. రోజురోజుకూ ఇక్కడ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది. దేశంలో కరోనా వైరస్ అధికంగా ప్రబలిన రాష్ట్రాలలో తమిళనాడు తృతీయ స్థానంలో ఉండటం గమనార్హం. ఇప్పటికే 1242 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 118 మంది దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. మొత్తం 14 మంది కరోనాతో చనిపోయారు.
కరోనా కట్టడి కోసం ప్రజలంతా లాక్డౌన్ ను సహకరించాలని, సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది పోలీసుల ఆంక్షలు ధిక్కరిస్తూ, సామాజిక దూరం పాటించడంలేదు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి రాష్ట్రంలో వెలుగు చూసింది.
మధురై జిల్లాలోని ముదువరపట్టి గ్రామంలో జరిగిన ఓ ఘటన కలకలం రేపుతోంది. గ్రామంలోని ఆలయానికి చెందిన ఓ ఎద్దు ఇటీవల మృతి చెందింది. దీంతో వందల సంఖ్యలో గ్రామస్తులు గూమికూడి ఎద్దు అంత్యక్రియలు నిర్వహించారు. లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి గ్రామంలో గుంపులుగుంపులుగా తిరిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే సదరు గ్రామస్తులపై కేసులు నమోదు చేశారు.