కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను ఎంత వేగంగా చేపడితే.. అంతవేగంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడమేగాకా.. సకాలంలోబాధితులకు వైద్యసేవలు అందించవచ్చు.. ఇది మొదటి నుంచీ వైద్యనిపుణులతోపాటు పలువురు విశ్లేషకులు చెబుతున్నమాట. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. ఇతర దేశాలతో పోల్చితే..భారత్లో పాజిటివ్ కేసులు ఎందుకు తక్కువగా నమోదు అవుతున్నాయంటే.. నిర్ధారణ పరీక్షలు చాలా నెమ్మదిగా చేయడమే కారణమని కూడా నిపుణులు చెబుతున్నారు. ఇతర దేశాలు అమెరికా, చైనా, దక్షిణ కొరియా, పలు యూరప్ దేశాలతో పోల్చితే.. భారత్లో చాలా నెమ్మదిగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఆయా దేశాల్లో మిలియన్ జనాభాకుగాను వేలమందికి నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా.. ప్రస్తుతం భారత్లో మాత్రం మిలియన్ జనాభాకుగాను కేవలం 203మందికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. అంటే.. భారత్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎంత నెమ్మదిగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
నిజానికి.. ఈ సంఖ్య కూడా కొద్దిరోజులుగా పెరిగింది. మార్చి 25వ తేదీ నాటికి భారత్లో మిలియన్ జనాభాకుగాను కేవలం 18మందికి మాత్రమే వైద్యనిర్ధారణ పరీక్షలు చేశారు. ప్రస్తుతం ల్యాబ్ల సంఖ్య పెంచడంతో నిర్ధారణ పరీక్షల్లో వేగం పెరిగింది. ప్రస్తుతం రోజు సుమారు 15 నుంచి 20వేల వరకు పరీక్షలు చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు మొత్తం 2.5లక్షల నిర్ధారణ పరీక్షలు చేశారు. ప్రపంచంలో అత్యంత స్లోగా పరీక్షలు చేస్తున్నదేశాల్లో భారత్ నిలుస్తుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల వేగాన్ని పెంచాలని అన్నారు. ఇక్కడ చాలా నెమ్మదిగా పరీక్షలు జరుగుతున్నాయని, అది వైరస్ వ్యాప్తికి దోహదం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.