లాక్డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ మత్స్యకార కుటుంబానికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. క్వారంటైన్ పూర్తిచేసుకున్న వారికి కూడా రూ.2వేల చొప్పున ఆర్థిక సాయం అందించిన విసయం తెలిసిందే. వారు పౌష్టికాహారం తీసుకునేందుకు ఈసాయం అందించింది ప్రభుత్వం. ఇక ఏపీలో కొత్తగా మరో 38కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 572కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
గడచిన 24 గంటల్లో జరిగిన కరోనా నిర్దారణ పరీక్షల్లో.. కర్నూలు జిల్లాలో 13, నెల్లూరు 6. అనంతపురం 5, చిత్తూరు 5, కృష్ణా 4 , గుంటూరు 4, కడప 1 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 35 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, 14 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 523 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 126 కరోనా పాటిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు.