తెలంగాణలో కొవిడ్-19 కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే మరో 66 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 766కు చేరుకుంది. అయితే.. రాష్ట్రంలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్లోనే నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య 417కు చేరుకుంది. దీంతో హైదరాబాద్పై ప్రభుత్వం ఎక్కువగా దృష్టాసారిస్తోంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. అంతకుముందు నగరంలోని కంటైన్మెంట్ జోన్లలో మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా పర్యటించారు.
మంత్రి ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కాచిగూడలో మొదటిసారిగా శానిటైజింగ్ బస్సును సిద్ధం చేశారు. పాతబస్సులో సీట్లను తొలగించి రెండు వైపులా కిటికీలకు పైభాగాల్లో లిక్విడ్ను స్ప్రే చేసే 12 నాజిల్స్ ఏర్పాటు చేశారు. అంతేగాకుండా బస్సులో 200 లీటర్ల కెపాసిటీ ఉండేలా ట్యాంక్ ఏర్పాటు చేశారు. దీనికి మోటార్ బిగించారు. వెనక డోర్ నుంచి ముందు డోర్ వరకు రెండువైపులా పైపులను ఏర్పాటు చేశారు అధికారులు.