కరోనా వైరస్ కట్టడికి కొనసాగుతున్న లాక్డౌన్ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఓ వైపు కరోనా వ్యాప్తి నిరోధానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ పేదల ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారిస్తోంది. ఇందులో ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా సాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇస్తున్నారు. ఈ మేరకు రేషన్ కార్డుదారులందరికీ ఇప్పటికే బియ్యం అందజేసింది. ఇటీవల రూ.1500రూపాయలను కూడా వారి ఖాతాల్లో జమ చేసింది. అయితే.. బ్యాంక్ ఖాతా, ఆధార్ లింక్ లేనివారికి మాత్రం డబ్బులు జమచేయలేకపోయింది. దీంతో వారందరికీ కూడా డబ్బులు అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ విషయాన్ని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. బ్యాంక్ ఖాతాలతో ఆధార్ కార్డు లింక్ లేని ఖాతాల్లో నగదు జమ కాలేదని, అటువంటి వారికి నేరుగా నగదు అందజేస్తామని తెలిపారు. 5 లక్షల 21 వేల 640 కార్డుదారులకు నగదును బ్యాంకుల్లో వేయలేకపోయామని, వారందరికీ నేరుగా, లేదా తపాలా ద్వారా నగదు అందజేస్తామని వెల్లడించారు. బ్యాంకులో పడిన నగదు తీసుకోకుంటే వెనక్కు వెళ్లిపోతుందన్న పుకార్లను ఎవరూ నమ్మవద్దని ఆ నగదును ఎప్పుడైన తీసుకోవచ్చని తెలిపారు. బ్యాంకుల వద్ద లబ్ధిదారులు గుమికూడకుండా సామాజిక దూరం పాటిస్తూ నగదు తీసుకోవాలని ఆయన సూచించారు.