ప్రాణాలకు తెగించి కరోనా వైరస్తో వైద్యసిబ్బంది పోరాడుతున్నారు. ప్రమాదకరమని తెలిసినా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఈ క్రమంలో డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికులు, ల్యాబ్ టెక్నీషియన్లు కరోనా బారినపడుతున్నారు. ఈ సంఖ్య ఢిల్లీలోనే ఎక్కవగా ఉంది. తాజాగా.. ఎయిమ్స్కు చెందిన నర్సింగ్ అధికారిణి, అమె 20 నెలల బిడ్డ ఇద్దరూ కరోనా వైరస్ బారినపడ్డారు. అయితే..వీరి సంక్షేమం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారి కుటుంబాలకు భరోసా ఇచ్చారు.
డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారిశుధ్య కార్మికులు కరోనా సోకి మరణిస్తే.. వారి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందిస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ ప్రకటన ఆయా వర్గాల్లో ఎంతో భరోసాను నింపింది. ఢిల్లీలో ఇప్పటివరకు 1767 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. మొత్తం 42మంది మరణించారు. ఆస్పత్రులలో 911 మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో 27మంది ఐసీయూలో, ఆరుగురు వెంటిలేటర్లపై ఉన్నారు.