ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20వ తేదీ తర్వాత లాక్డౌన్ అమలులో ఎలాంటి సడలింపులు లేకుండా... మరింత కఠినంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీకి ఎక్కువగా విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారని, అందుకే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, ఇంతటి కఠిన పరిస్థితుల్లో లాక్డౌన్ అమలులో సడలింపులు ఇవ్వడం సాధ్యంకాదని ఆయన స్పష్టం చేశారు.
ఈ వారంలో నిపుణులతో మాట్లాడి.. ఆ తర్వాత ఆలోచిస్తామని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో ఇప్పటివరకు 1767 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. మొత్తం 42మంది మరణించారు. ఆస్పత్రులలో 911 మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో 27మంది ఐసీయూలో, ఆరుగురు వెంటిలేటర్లపై ఉన్నారు. కాగా, డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారిశుధ్య కార్మికులు కరోనా సోకి మరణిస్తే.. వారి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందిస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే.