కొవిడ్-19 కలకలం రేపుతోంది. అప్పుడే పుట్టిన శిశువులకు కూడా ఈ వైరస్ సోకుతోంది. తాజాగా.. భోపాల్లో ఆదివారం 12 రోజుల ఆడబిడ్డకు కరోనావైరస్ సోకడంతో అధికార వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. కరోనా వైరస్ బారిన పడిన అతిపిన్నవయస్కురాలిగా ఈ చిన్నారి నిలుస్తుందని వైద్యాధికారులు పేర్కొన్నారు. ఆమె ఏప్రిల్ 7న జన్మించింది. అయితే.. పుట్టిన సమయంలో విధుల్లో ఉన్న ఒక మహిళా ఆరోగ్య కార్యకర్త నుంచి ఆమెకు కరోనా వైరస్ సోకి ఉండవచ్చునని చిన్నారి తండ్రి చెప్పారు. *తల్లి, శిశువుకు నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది* అని భోపాల్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (సీఎంహెచ్ఓ) డాక్టర్ ప్రభాకర్ తివారీ చెప్పారు.
ఈ సందర్భంగా బాలిక తండ్రి మాట్లాడుతూ.. * ఏప్రిల్ 7 న ప్రభుత్వ సుల్తానియా జనన ఆసుపత్రిలో మా పాప జన్మించింది. సిజేరియన్ డెలివరీ. తల్లీబిడ్డలను డిశ్చార్జ్ చేసి ఏప్రిల్ 11న ఇంటికి వచ్చారు. అయితే.. ఆ మరుసటి రోజు నేను పేపర్లో చదివాను. ఒక మహిళా ఆరోగ్య కార్యకర్తకు కరోనా సోకినట్లు అందులో ఉంది. అది నా భార్య డెలివరీ అయిన ఆస్పత్రే కావడంతో షాక్ అయ్యాను* అని ఆందోళన వ్యక్తం చేశాడు. వెంటనే వైద్యాధికారులను సంప్రదించగా.. పరీక్షలు చేసి, కరోనా సోకినట్లు చెప్పారని తెలిపారు. ఈ ఘటనతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.