కరోనా వైరస్ కట్టడికి కేంద్రం ప్రభుత్వం ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగించిన విషయం తెలిసిందే. తాజాగా.. తెలంగాణలో మే 7వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే.. మే 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్డౌన్ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అందులో ఉన్న ముఖ్యమైన విషయం ఏమిటన్నదానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కచ్చితమైన శాస్త్రీయ లెక్కలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నెల 12 ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణలో లాక్డౌన్ను ఏప్రిల్ 30వ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ సమావేశంలో ఆయన ఒక కీలక విషయం చెప్పారు. అంతాబాగుంటే.. ఏప్రిల్ 24వ తేదీ తర్వాత కరోనా బారి నుంచి తెలంగాణ బయటపడినట్టేనని చెప్పారు. కానీ.. పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. తెలంగాణలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24 తర్వాత కూడా కరోనా ప్రభావం కొనసాగే ప్రమాదం ఉంది. ఈ తేదీ నుంచి అంటే ఏప్రిల్ 24 నుంచి క్వారంటైన్ సమయం(14 రోజులు) ఆధారంగా మే 7వ తేదీ వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్డౌన్ను పొడిగించి ఉంటారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ 24వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు క్వారంటైన్ పూర్తి చేసుకునే వారి విషయంలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉండే అవకాశం ఉందని భావించి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అంటున్నారు.