మే 7వ తేదీ వరకు రాష్ట్రంలో సామూహిక పండుగలు, ప్రార్థనలకు అనుమతి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రపం చ ప్రసిద్ధి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానాన్నే మూసివేశారన్నారు. తెలంగాణలో అనేక ప్రముఖ ఆలయాలను మూసివేశామన్నారు. ఉగాది, శ్రీరా మ నవమిని లాంటి పర్వదినాలను కూడా ఇండ్లలోనే జరుపుకున్నామని సీఎం చెప్పారు. కరోనా వైరస్ కట్టడికి అన్ని మతాల సామూహిక ప్రార్థనలకు అనుమతి నిరాకరించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణలో లాక్డౌన్ పొడిగింపుపై సీఎం కేసీఆర్ కుండబద్ధలు కొట్టారు. మే 7వరకూ తెలంగాణలో లాక్డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. అం తేకాదు, తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ సడలింపులు ఉండవని సీఎం ప్రకటించారు. కేబినెట్లో చర్చించిన అనంతరం ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఏప్రిల్ 20 తర్వాత కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ సడలింపులు ఉంటాయని కేంద్రం ప్రకటించింది. అయితే.. రాష్ట్రాల్లో పరిస్థితిని బట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపుపై నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసిందని సీఎం చెప్పారు. నిత్యావసరాలు ఎప్పటిలానే అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.