లాక్డౌన్ అమలులో పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. కరోనా వైరస్ కట్టడిలో అత్యంత కీలక పాత్రపోషిస్తున్నారు. ఇదే సమయంలో ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా.. సమాచారం అందిన క్షణంలోనే స్పందిస్తున్నారు. వారి కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తున్నారు. అర్ధరాత్రి పురిటి నొప్పులతో తల్లడిల్లుతున్న నిండుగర్భిణిని ఆస్పత్రికి తరలించగా అమె పండంటి బిడ్డకు జన్మనించింది. ఈ ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. కట్టెలగూడ ఉస్మాన్పురాకు చెందిన రబియా ఉన్నిసాకు ఆదివారం అర్ధరాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. అయితే.. లాక్డౌన్ కారణంగా ఎలాంటి వాహనాలు అందుబాటులో లేవు. దీంతో రబియా తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో తల్లి, సోదరితో కలిసి కాలినడకన దవాఖానకు బయలుదేరింది.
ఈ విషయం మీర్చౌక్ పోలీసులకు తెలియడం వెంటనే చాదర్ఘాట్ పోలీసులను అప్రమత్తం చేశారు. పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది అబ్దుల్ మతీన్, మస్తాన్వలీ వెంటనే ఆమెను పెట్రోలింగ్ కారులో మలక్పేట్ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం ఉదయం రమీ ఉన్నీసా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గర్భిణిని ఆస్పత్రికి తరలించిన పోలీసులపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. పోలీసుల సేవలకు సెల్యూట్ చేస్తున్నారు.