కరోనా కట్టడికి తెలంగాణ సర్కార్ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. వైరస్ వ్యాప్తి నియంత్రణకు, లాక్ డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడుగా నిర్ణయం తీసుకుంటున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. దీంతో దేశంలోనే అతి పెద్ద కరోనా ఆస్పత్రిగా అత్యా ధునిక వైద్య సదుపాయాలతో హైదరాబాద్ శివారులో ఉన్న గచ్చిబౌలిలో 1500 పడకల ఆస్పత్రిని తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసింది. చైనా కేవలం ఎ నిమిది రోజుల్లోనే 1000 పడకల ఆస్పత్రిని కట్టగా… తెలంగాణ 20 రోజుల్లోపే… దాని కంటే పెద్ద ఆస్పత్రిని సిద్దం చేసింది.
1500 పడకలను సిద్దంగా ఉంచింది. నేడు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన ఓ కాంప్లెక్స్ను పూర్తిగా కరోనా ఆస్పత్రిగా మార్చింది రాష్ట్ర సర్కార్. 15 అంతస్తులు ఉన్న ఈ కాంప్లెక్స్ ని దవాఖానగా మార్చడానికి యుద్ద ప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం పని చే సింది. ఫర్నిచర్, మెడికల్ కిట్స్ అన్నీ రెడీగా ఉంచారు.
తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్పత్రిలో 468 గదుల్లో 50 పడకల ఐసీయూ బెడ్లు ఉన్నాయి. ఒక్కో అంతస్తులో 36 గదులు, ఒక్కో గదిలో 23 పడకలు ఉండగా దీన్ని పూర్తిగా కరోనా ఆస్పత్రిగానే వాడతారు. వైద్యం అందించేందుకు డిప్యూటేషన్ మీద 70 మంది డాక్టర్లను, 120 మంది నర్సులను, పారా మెడికల్ స్టాఫ్ను అందుబాటులో ఉంచారు. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ గా దీన్ని మార్చారు.