ఏపీలో కరోనా వైరస్ కట్టడికి ముఖ్యమంత్రి జగన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేశారు. ఎంత వేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తే.. అంతవేగంగా కొవిడ్-19ను నియంత్రింవచ్చునన్న వ్యూహంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే.. ఏపీలో కిట్ల తయారీతోపాటు దక్షిణ కొరియా నుంచి ప్రత్యేకంగా లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లను తెప్పించారు. వీటి ద్వారా కేవలం పదినిమిషాల్లోనే ఫలితం వస్తుంది. దీంతో రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు వేగంగా జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఏపీ వైద్యులు రికార్డు స్థాయిలో నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. రోజుకు 5,508 కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించి రికార్డు సృష్టించారు. అత్యధికంగా కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. మున్ముందు ఈ సంఖ్య మరింతగా పెంచేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న గుంటూరు, కర్నూలు తదితర జిల్లాలపై ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. ఇదిలా ఉండగా.. లాక్డౌన్ అమలులోనూ దేశంలో ఏపీ రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.