తెలగాణలో కరోనా వైరస్ రోజురోజుకూ తన ప్రతాపాన్ని చూపుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఈరోజు కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 928కి చేరుకున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈరోజు 8మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 194కు చేరుకున్నట్లు అధికారులు తలిపారు. ఇప్పటివరకు మొత్తం 23మంది మరణించినట్లు పేర్కొన్నారు.
అయితే.. ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ఈరోజు సూర్యపేట జిల్లాలో ఏకంగా 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేటపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. కరోనా కట్టడికి మరింత కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్లో కూడా కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు అధికారులు. అయితే..రోజవారీగా నమోదు అయ్యే కేసుల సంఖ్య తగ్గకపోవడంతో ప్రభుత్వంలో, ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.