వైరస్ల వ్యాప్తికి సంబంధించిన మూడేళ్ల పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. వైరస్ల వల్ల వచ్చే స్వైన్ ఫ్లూ, కొవిడ్-19 కేసులు అత్యధికంగా దేశంలోని 12 రాష్ట్రాల్లోనే ఎక్కువగా నమోదు అయ్యాయని ఈ పరిశోధనలో నిపుణులు గుర్తించారు. ఇందుకు ప్రధానంగా పెరుగుతున్న జనసాంద్రత తదితర కారణాలతోనే వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో దేశ జనాభాలో 72శాతం ఉండగా.. 92 శాతం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఇక్కడే నమోదు కావడం గమనార్హం.
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. అందులోనూ ముంబై నగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొవిడ్-19 మరణాలు కూడా ఇక్కడే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఆ తర్వాత ఢిల్లీలో కూడా కొవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగానే ఉంది. మధ్యప్రదేశ్, రాజస్తాన్లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ తీవ్రమవుతోంది.