మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసమైన వర్ష బంగళా వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టరుకు కరోనా వైరస్ సోకిన ఘటన కలకలం రేపుతోంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ముంబై నగరంలోని తన అధికారిక నివాసమైన వర్ష బంగళాలో నివాసముంటున్నారు. ఈ బంగళాలో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐకు కరోనా పాజిటివ్ అని రావడంతో అతడితో సన్నిహితంగా మెలగిన కుటుంబసభ్యులు, పోలీసులు ఆరుగురిని క్వారంటైన్ కు తరలించారు.
సీఎం ఇంటితోపాటు ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేయించారు. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 5, 218 కు చేరింది. అందులో 722 మంది దవాఖానలో చికి త్స పొంది కోలుకోగా, కరోనా బారిన పడి ఇప్పటికే 251 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 531 కేసులు నమోదయ్యాయి. ముంబై నగరంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. మహారాష్ట్ర సర్కారు అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నా... కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంత గమనార్హం.