ఏపీలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. రోజురోజుకూ వైరస్ ప్రభావం తీవ్రమవుతోంది. తాజాగా.. గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చాగల్లులో గర్భిణి మృతి చెందింది. ఈ విషయాన్ని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనునాయక్ తెలిపారు. గత కొన్ని రోజులుగా అస్వస్థతకు గురైన ఆమెను వైద్యం కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ నేపథ్యంలో వైద్యులు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఒక్కసారిగా వైద్యవర్గాలు ఆందోళనకు గురయ్యాయి. వెంటనే అప్రమత్తం అయిన అధికారులు ఆమె గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను క్వారంటైన్కు తరలించారు.
ఈ ఘటనతో జిల్లాలో కలకలం రేగుతోంది. గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఏపీలో ప్రధానంగా గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉండడంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినా.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో అధికారవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని రెడ్ జోన్లలో మళ్లీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేపడుతామని ఈరోజు మధ్యాహ్నమే మంత్రి ఆళ్ల నాని తెలిపారు.