తెలంగాణలో కరోనా విజృంభిస్తూనే ఉంది.. రాష్ట్రంలోని హైదరాబాద్, సూర్యాపేట, గద్వాల.. ఈ మూడు ప్రాంతాల్లోనే పాజిటివ్ కేసులు ఎక్కువ సంఖ్య లో బయట పడుతున్నాయి. బుధవారం కొత్తగా 15 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ పరిధిలో 10 కేసులు నమోదు కాగా, సూర్యాపేటలో కొత్తగా మరో మూడు కేసులు, గద్వాలలో రెండు కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో వెల్లడించింది.
సూర్యాపేట జిల్లాలో బుధవారం నమోదైన మూడు కేసులూ జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ ప్రాంతంలోనివే కావడం గమనార్హం. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు 83 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ప్రభుత్వ క్వారంటైన్లో 187 మంది ఉండగా, హోం క్వారంటైన్లో 4382 మంది ఉన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 725 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 943కు చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 24కు చేరుకుంది. కాగా క రోనా నుంచి ఇప్పటి వరకు 194 మంది కోలుకున్నారు.