దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని హోటళ్లు, క్లబ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాల్లో లాక్డౌన్ సందర్భంగా మద్యాన్ని విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ సర్కారు తాజాగా హెచ్చరించింది. మద్యం లైసెన్సులు పొందిన వారు లాక్ డౌన్ సమయంలో మద్యాన్ని విక్రయిస్తే వారి లైసెన్సులను రద్దు చేయడంతోపాటు వారి పేర్లను బ్లాక్ లిస్టులో పెడతామని ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ రవి ధావన్ హెచ్చరించారు.
కొన్ని స్టోర్లు, క్లబ్ లు, రెస్టారెంట్లలో మద్యం విక్రయిస్తున్నారని అందిన సమాచారం మేర తాము నిఘా పెట్టామని ఢిల్లీ ఎక్సైజ్ అధికారులు చెప్పారు. లాక్ డౌన్ సమయంలో మద్యం విక్రయిస్తున్న 14 మందిని అరెస్టు చేసి, 8,400 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ అధికారులు చెప్పారు. కాగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే 2248 కేసులు నమోదుకాగా, కరోనాతో 48 మంది మరణించారు. కాగా 724 మంది కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు.