ఆ బామ్మ వయస్సు 92ఏళ్లు. సుమారు ఏడు నెలల క్రితం పక్షవాతం వచ్చింది. దీంతో ఆమె ఎడమ వైపు శరీరం మొత్తం అచేతనంగా మారిపోయింది. ఈక్రమంలోనే ఆమె కరోనా బారినపడింది. అయితేనే.. అధైర్యపడకుండా క్వారంటైన్ పూర్తి చేసుకుని కరోనాను జయించి క్షేమంగా ఇంటికి చేరుకుంది.. అందరికీ ధైర్యాన్నిచ్చింది. ఈ భామ్మది ఎక్కడని అనుకుంటున్నారా.. ఈ అద్భుతం జరిగింది మన భారత్లోనే..! ఈ సందర్భంగా ఆమెకు చికిత్స అందించిన పుణెలోని సింబోసిస్ యూనివర్సిటీ హాస్పిటల్ సీఈవో డాక్టర్ విజయ్ నటరాజన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కరోనా వైరస్తో వృద్ధులకు ఎక్కువ ముప్పు ఉన్నప్పటికీ... కొవిడ్-19 సోకినవారంతా చనిపోతారని భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఆమె కోలుకోవడం ద్వారా ఈ వైరస్ బారి నుంచి వృద్ధులు కూడా కోలుకోగలరని మరోసారి రుజువైందని వైద్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ఈ బామ్మతో పాటు ఆమె కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులకు కొవిడ్-19 పాజిటివ్ రావడంతో పుణేలోని సింబోసిస్ ఆస్పత్రిలో చేర్చించారు.