మహారాష్ట్రలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 778 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6427 కు చేరుకుందని ఆరోగ్య అధికారులు తెలిపారు. గురువారం నాడే ఏకంగా 14 మంది మరణించారు. మరణాల సంఖ్య 283కు చేరుకుందని వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 840 కొవిడ్ -19 రోగులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. ఇక దేశ వాణిజ్యరాజధాని ముంబై నగరంలో పరిస్థితి దారుణంగా మారుతోంది. సుమారు నాలుగేవేల పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వార్తలు వస్తున్నాయి.
దేశవ్యాప్తంగా గత 24గంటల్లోనే దేశ్యాప్తంగా రికార్డు స్థాయిలో 1409 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21700కు చేరుకుంది. 16689 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 686మంది మృతి చెందారు. 4325 మంది కోలుకున్నారు. అలాగే.. 14 రోజుల నుంచి దేశవ్యాప్తంగా 78 జిల్లాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో సుమారు 48శాతం కేసులు కేవలం మూడు రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో 6427 కేసులు ఉన్నాయి. గుజరాత్లో 2,407కుపైగా, ఢిల్లీలో 2,248కుపైగా కేసులు నమోదు అయ్యాయి.