భారత్లో కరోనా మహమ్మారి రోజురోజుకూ మరింతగా రెచ్చిపోతోంది. కొవిడ్-19 కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. ఇప్పటివరకు .. దేశవ్యాప్తంగా 23, 113 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సుమారు 686మందికిపైగా మృతి చెందారు. 4325 మంది కోలుకున్నారు. అలాగే.. 14 రోజుల నుంచి దేశవ్యాప్తంగా 78 జిల్లాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో సుమారు 48శాతం కేసులు కేవలం మూడు రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. ఏకంగా ఏడువేలకు చేరువలో కేసుల సంఖ్య ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 778 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6427కు చేరుకుందని ఆరోగ్య అధికారులు తెలిపారు. గురువారం నాడే ఏకంగా 14 మంది మరణించారు. మరణాల సంఖ్య 283కు చేరుకుందని వెల్లడించారు. ఇక దేశ వాణిజ్యరాజధాని ముంబై నగరంలో పరిస్థితి దారుణంగా మారుతోంది. ధారావిలో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. మహారాష్ట్ర తర్వాత గుజరాత్లో 2,407కుపైగా, ఢిల్లీలో 2,248కుపైగా కేసులు నమోదు అయ్యాయి.