దేశంలో మొట్టమొదటి సారిగా ఢిల్లీలో కరోనా పేషెంట్లకు ప్లాస్మా చికిత్సను అందించి వైద్యులు విజయం సాధించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శుక్రవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం నలుగురు కరోనా బాధితులకు ప్లాస్మా చికిత్స అందించామని, వారందరూ కోలుకున్నారని, సానుకూల ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. సాకేత్లోని మాక్స్ ఆస్పత్రిలో ఒకరికి, లోక్నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రిలో ముగ్గురికి ప్లాస్మా థెరపీ నిర్వహించగా సానుకూల ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఇది దేశంలో పరిణామమని ఆయన పేర్కొన్నారు. కొవిడ్ -19 నుంచి కోలుకున్న వారందరూ ముందుకు వచ్చి మితగా వారికి ప్లాస్మా దానం చేయాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా వైద్యులు కూడా పిలుపునిచ్చారు. దేశభక్తి చూపించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని వారు పిలుపునిచ్చారు. ప్లాస్మాను దానం చేయడానికి ఎక్కువగా ముందుకు రావడం లేదని.. దేశభక్తిని చూపించాల్సిన సమయం ఇదేనని వారు పేర్కొన్నారు. సానుకూల దృక్పథంతో వారు ముందుకు వచ్చి మిగతా వారిని కాపాడేందుకు సహకరించాలని కోరారు. కాగా, కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి రక్తం సేకరించి, దాని నుంచి ప్లాస్మాను వేరు చేసి, కరోనా పేషెంట్లకు చికిత్స అందించడమే ప్లాస్మా చికత్స.