భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. శుక్రవారం మధ్యాహ్నం వరకు పాజిటివ్ కేసులు 23,502 కు చేరుకున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపింది. ఒక్కరోజులోనే 1684 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని పేర్కొంది. ఇది ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఒక్కరోజులో నమోదు అయిన రికార్డు స్థాయి కేసులు కావడం గమనార్హం. 525,667 మంది నుండి మొత్తం 541,789 నమూనాలను ఇప్పటి వరకు పరీక్షించినట్లు ఐసిఎంఆర్ తెలిపింది. మృతుల సంఖ్య 720కు చేరుకుందని పేర్కొంది.
అత్యధికంగా సుమారు ఆరు రాష్ట్రాల్లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్ర (6,430), గుజరాత్ (2,624), ఢిల్లీ (2,376), రాజస్థాన్ (1,964), మధ్యప్రదేశ్ (1,699), తమిళనాడు (1,683)లో కొవిడ్-19 కేసులు నమోదు అయ్యాయని ఐసిఎంఆర్ పేర్కొంది. అయితే.. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోనే ఏకంగా 4,205 కేసులు నమోదు అయ్యాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 2,726,752 కరోనావైరస్ కేసులు నమోదు అయ్యాయి. మరణాల సంఖ్య 191,061కు చేరుకుంది. ఇప్పటివరకు 730,843మంది కోలుకున్నారు.