గలగలపారేటి గంగమ్మతల్లిని నల్లరేగళ్లకే మళ్లించినాడమ్మ.. కాళేశ్వరంతోటి లక్షల ఎకరాలు కళకళాడించే మన పెద్ద రైతన్న.. ఎట్టుండే మన పల్లెలు.. గతమంత నెర్రెబారిన నేలులు.. ఏడేండ్ల ఈ పొద్దులో చిగురించే మెల్లగా మన బతుకులు.. బక్కపల్చనివాడు ఉక్కుగుండెలవాడు బందూకులా కదిలినాడు.. అక్కరొచ్చె పనులు ఒక్కొక్కటే చేస్తూ రెక్కలే తొడుగుతున్నాడు.. నేలతల్లిగర్భంలోన పెరుగన్నమైనాడు అందరినీ ప్రేమించే మన చంద్రశేఖరుడు.. ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఓ కళాకారుడు పాడిన అద్భుతమైన పాట. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో ఈరోజు మరో అపురూప ఘట్టం ఆవిష్కారమైంది.
శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి గోదావరిజలాలు సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్లోకి చేరాయి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ శివారులో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు కాళేశ్వరం ప్రాజెక్టులోని ఏడో దశ రంగసాయక సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన పంప్హౌస్ల వెట్రన్ను ప్రారంభించారు. రంగనాయకసాగర్లోకి గోదావరి జలాల ఎత్తిపోత ప్రారంభంతో కాళేశ్వరం ప్రాజెక్టు పది దశల ఎత్తిపోతలలో ఏడోదశ సంపూర్ణమైంది. రంగనాయకసాగర్ ప్రాజెక్టుతో సిద్ధిపేట నియోజకవర్గంలో సుమారు 71,516 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ సందర్బంగా టీఆర్ఎస్ పార్టీ ఈ పాటను ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
రంగనాయకసాగర్లోకి గోదావరి జలాల ఎత్తిపోత ప్రారంభం. కాళేశ్వరం ప్రాజెక్టు పది దశల ఎత్తిపోతలలో ఏడోదశ సంపూర్ణం.#KaleshwaramProject pic.twitter.com/6pZCdHab0R
— trs party (@trspartyonline) April 24, 2020