తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. అందులోనూ హైదరాబాద్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. తాజాగా.. రామాంతపూర్లోని ఓ కిరణా వర్తకుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. అప్రమత్తమైన అధికారులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం శనివారం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక బాధితుడి కుటుంబ సభ్యులైన మరో ఇద్దరిని పోలీసులు క్వారంటైన్కు తరలించారు. సదరు పాజిటివ్ బాధితుడు ఇటీవల నాగోల్లోని తన బంధువులను కలిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఆ వ్యక్తి కలిసిన అతడి బంధువులను, కిరాణా షాపులో వస్తువులు కొన్న వారి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
కాగా, కిరాణా షాపు వర్తకుడికి కరోనా పాజిటివ్ రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, సదరు బాధితుడు నివాసం ఉంటున్న శ్రీరమణపురంలోని కాలనీలకు జీహెచ్ఎంసీ బారీకేడ్లతో శుభ్రత చర్యలు చేపట్టింది. ప్రధానంగా హైదరాబాద్లోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండంతో అధికారులు మరింత కట్టుదిట్టంగా చర్యలు తీసుంటుకున్నారు. ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.