కరోనా.. కరోనా.. అందుగలదు.. ఇందులేదని సందేహము వలదు.. ఎందెందు వెతికినా.. అందందె గలదు.. అన్నట్టే ఉంది కరోనా వైరస్ వ్యాప్తి..! ఈ మహమ్మారి గురించి రోజుకో భయంకరమైన విషయం వెల్లడవుతోంది. నిన్నమొన్నటివరకు మురుగునీటిలో, నిన్న సాధారణ నీటిలో కూడా కరోనా వైరస్ను గుర్తించారు పరిశోధకులు.. ఇక తాజాగా దుమ్ము కణాల్లోనూ కరోనా ఉందని గుర్తించారు ఇటలీ శాస్త్రవేత్తలు. రెండు ప్రాంతాల్లో వాయు కాలుష్య నమూనాలను సేకరించి పరీక్షించామని, ఈ నమూనాల్లో కరోనా జన్యువును గుర్తించామని బొలాన్యా యూనివర్సిటీ ప్రొఫెసర్ లియోనార్డో సెట్టి వెల్లడించారు.
అయితే ఇది దుమ్ము కణాల్లో ఏ స్థాయి ఉంటుంది..? ఎంత దూరం ప్రయాణిస్తుంది..? మనుషులపై ఏమేరకు ప్రభావం చూపుతుందన్న దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఇంకా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు ఇటలీ శాస్త్రవేత్తలు. అయితే.. వాయు కాలుష్య కణాలు ఎంత ఎక్కువగా ఉంటే.. వైరస్ సంక్రమణ అంత ఎక్కువగా ఉంటుందని మాత్రం అంటున్నారు. సాధారణంగా కరోనా రోగి తుమ్మినప్పుడుగానీ, దగ్గినప్పుడుగానీ ఆ తుంపర్ల ద్వారా వైరస్ బయటకు వస్తాయని, కాలుష్య కణాలనేవి వైరస్తో కూడిన తుంపర్లను మోసుకెళ్లే మైక్రో విమానాలుగా అభివర్ణించారు పరిశోధకులు.