ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు మరో కీలక సందేశం ఇవ్వబోతున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, కట్టడి చర్యలు, లాక్డౌన్ అమలు, సడలింపులకు సంబంధించి కీలక అంశాలు వెల్లడించే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్కీబాత్ రేడియో కార్యక్రమం ద్వారా ప్రసంగించనున్నారు. మన్కీబాత్లో ప్రధాని రేడియో ప్రొగ్రాం 64వ ఎడిషన్. గత ఎడిషన్లో కోవిడ్-19 కారణంగా దేశంలో ఏర్పడ్డ పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 24వ తేదీన దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే.. కరోనా వైరస్ విజృంభనతో ఈ లాక్డౌన్ను మే 3వ తేదీ వరకు ఆయన పొడిగించారు. ప్రస్తుతం మే 3వ తేదీ కూడా దగ్గరపడుతుండంతో మళ్లీ అందరిలో ఉత్కంఠ ఏర్పడుతోంది.
దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ లాక్డౌన్ను పొడిగించకతప్పదా..? అనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో మానసిక స్థైర్యం పెంచేందుకు మోడీ ఏం చెబుతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 24,942 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 5,210 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. 779 మంది మరణించారు.