కరోనా వైరస్ను కట్టడి చేయడంలో తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు విజయవంతం అవుతున్నాయి. గత పది రోజులుగా ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసుల నమోదు రేటు దీనిని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో శనివారం కొత్తగా ఏడు కేసులు మాత్రమే నమోదవడం కొంత ఊరట నిస్తోంది. వీటిలో గ్రేటర్ పరిధిలో ఆరు ఉండగా, వరంగల్ అర్బన్ లో ఒక కేసు నమోదైంది. అయితే వరుసగా నాలుగు రోజుల నుంచి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం గమ నార్హం. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్లోనూ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
తెలంగాణలో తొలి కేసు నమోదుకాగానే ముఖ్యమంత్రి కేసీఆర్... అధికారులను అప్రమత్తం చేశారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయడంతోపాటు, పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాలను రెడ్జోన్లను ప్రకటించి ఆంక్షలు విధించింది. దీంతో ఇతర ప్రాంతాలకు వైరస్ విస్తరించకుండా ప్రభుత్వం నియంత్రించగలిగింది.