ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ఉదయం 11గంటలకు మన్కీబాత్ కార్యక్రమం నిర్వహించారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, కట్టడి చర్యలు, లాక్డౌన్ అమలుపై ఆయన మాట్లాడారు. కరోనా వైరస్పై యుద్ధం కొనసాగుతోందని, ఈ మహమ్మారిపై పోరులో దేశ ప్రజలు చూపుతున్న స్ఫూర్తి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. మనం చేస్తున్న యుద్దాన్ని ప్రపంచం గమనిస్తోందని ఆయన అన్నారు. దేశం మొత్తం ఐకమత్యంతో ముందుకు సాగుతోందన్నారు. కరోనాపై పోరాటంలో ప్రతీ పౌరుడు ఒక సైనికుడేనని ఆయన పేర్కొన్నారు. కరోనా కట్టడికి మనం అనుసరిస్తున్న విధానాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని మోడీ పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి నుంచి ఈ దేశాన్ని విముక్తి చేయడానికి వైద్యులు, నర్సులు.. కమ్యూనిటీ హెల్త్వర్కర్లు అందరూ పోరాడుతున్నారని ప్రధాని నరేంద్రమోడీ కొనియాడారు. ఈ ఇంతటి సంక్లిష్ల పరిస్థితుల్లోనూ ఈ దేశ ప్రజలకు ఆహారాన్ని అందించేందుకు రైతులు తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. కరోనాపై పోరాడుతున్న వారి కోసం పీఎం కొవిడ్ వారియర్స్ డిజిటల్ పోర్టల్ను ప్రారంభించామని ఆయన తెలిపారు. కోవిడ్ -19 కు వ్యతిరేకంగా యునైటెడ్ ఫ్రంట్ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.