కరోనా సమయంలోనూ కామాంధుల అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. లాక్డౌన్ కారణంగా గత రెండు వారాలుగా క్రైమ్ రేట్ భారీగా తగ్గింది.. అయితే ఇటీవల కొద్ది రోజులుగా మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. తాజాగా హర్యానా రాష్ట్రంలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు సామూ హిక లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది.
జింద్ జిల్లాలోని ఓ గ్రామంలో నివసించే 14 ఏళ్ల బాలికకు స్థానికంగా ఉండే బాలుడి (16) తో కొద్ది రోజులుగా పరిచయం ఉంది. శుక్రవారం సాయంత్రం ఆ బాలుడు ఆమె ఇంటికి వెళ్లి మాయ మాటలు చెప్పి స్కూల్ దగ్గరకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ బాలుడి ఇద్దరు ఫ్రెండ్స్ మాటువేశారు. ముగ్గురు ఆమెను బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి బాలికను విడిచిపెట్టారు.
జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముగ్గురు బాలురపై కిడ్నాప్, అత్యాచారం కేసులతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి.. పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరు బాలుర కోసం గాలింపు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.