కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పటిష్ట చర్యలు తీసుకున్నా కరోనా కల్లోలం ఆగడంలేదు. తాజాగా ఉత్తర ప్రదేశ్కు చెందిన ఓ కుటుంబంలో ఏకంగా 18 మందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. దారుల్ ఉలూమ్ దియోబంద్ ఇస్లామిక్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి గత నెల సంత్ కబీర్నగర్లోని మఘర్ ప్రాంతంలో ఉన్న తన స్వగృహానికి వచ్చాడు. ఈ మధ్యే అతడికి వైరస్ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు తేలింది.
దీంతో అప్రమత్తమైన అధికారులు అతడితోపాటు సన్నిహితంగా మెలిగిన 27 మంది నమూనాలను పరీక్షలకు పంపారు. అందులో 18 మందికి పాజిటివ్ అని తేలడంతో వారందరినీ క్వారంటైన్కు తరలించారు. మరో వైపు ఈ ఘటనతో ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. కాగా అధికారులు ఆ ప్రాంతాన్ని రెడ్జోన్గా ప్రకటించి పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఉత్తర ప్రదేశ్లో 1793 కేసులు నమోదవగా 27 మంది మృతి చెందారు.