మళ్లీ ఉత్కంఠ.. ఓవైపు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది.. మరోవైపు.. రెండో దశ లాక్డౌన్ గడువు మే 3వ తేదీ దగ్గరపడుతోంది.. లాక్డౌన్ను ఎత్తేస్తారా..? మళ్లీ పొగిడిస్తారా..? అన్న ఉత్కంఠ జనంలో మొదలైంది. ఇప్పటికే లాక్డౌన్ ఆంక్షల్లో కొన్ని సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ మరోసారి ముఖ్యమంత్రులతో సోమవారం నాడు సమావేశం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 14కు ముందుకూడా ప్రధాని నరేంద్రమోడీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారి నుంచి ఆయా రాష్ట్రాల్లో ఉన్న కరోనా వైరస్ ప్రభావం గురించి తెలుసుకున్నారు. దాదాపుగా ముఖ్యమంత్రులందరూ ఆ తర్వాత ఏప్రిల్ 14వ తేదీ తర్వాత కూడా లాక్డౌన్ను పొడిగించాలని కోరారు.
అయితే.. మళ్లీ ఇప్పుడు మే 3వ తేదీ దగ్గరపడుతుండడంతో ప్రధాని నరేంద్రమోడీ ముఖ్యమంత్రులతో సమావేశం కానుండడంతో అందరిలో ఉత్కంఠ రేపుతోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ కూడా మళ్లీ లాక్డౌన్ను పొడిగించేందుకే మొగ్గుచూపుతారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో లాక్డౌన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ మే 7వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణ దారిలోనే నడిచే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రదాని నరేంద్రమోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.