హమ్మయ్య.. కరోనా బారినపడిన 52మంది జర్నలిస్టుల్లో 31మంది కరోనాను జయించారు. మిగతావారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్దాం.. ఇటీవల ముంబైలోని జర్నలిస్టులకు అధికారులు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో 52మందికి కొవిడ్-19 సోకినట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా పాత్రికేయలోకం ఉలిక్కిపడింది. వెంటనే అప్రమత్తం అయిన అధికారులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఇక అప్పటి నుంచి చికిత్స పొందుతున్న వారిలో 31మంది కోలుకోవడంతో వారి కుటుంబాలు ఊపిరిపీల్చుకున్నాయి.
వారికి రెండుసార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. దీంతో ఆ జర్నలిస్టులను ముంబైలోని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అందరికీ 14 రోజుల ఇంటి నిర్బంధం అంటే హోం క్వారంటైన్లో ఉండాలని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) అధకారులు సూచించారు. ఇదిలా ఉండగా.. ఈరోజు కరోనాతో 52 ఏళ్ల హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. దీంతో కరోనా బారినపడి మృతి చెందిన పోలీసుల సంఖ్య రెండుకు చేరుకుంది. ఈ పరిణామాలతో ఆయా వర్గాల్లోతీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.