ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి అంతమయ్యేదెన్నడు?.. ఈ ప్రశ్నకు ‘సింగపూర్ యూని వర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ (ఎస్యూటీడీ) పరిశోధకులు సమాధానం ఇస్తున్నారు. డిసెంబర్ 8 నాటికి కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. రోజువారీ కేసుల నమోదు, మరణాలు, కోలుకుంటున్నవారి సంఖ్య, వైరస్ వ్యాప్తి రేటు, లాక్డౌన్ ఆంక్షలు, ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఏయే దేశాల్లో ఎప్పుడు వైరస్ అంతమవుతుందన్నదానిపై అధ్యయనం చేశారు. కొత్త కేసుల నమోదు 97 శాతం తగ్గిపోయినట్లయితే ఆ దేశం గ్రీన్జోన్లోకి ప్రవేశించినట్లుగా పేర్కొన్నారు. ఈ అంచనాల ప్రకారం..భారత్ మే 21 నాటికి గ్రీన్జోన్లోకి ప్రవేశించనుంది. మే 31 నాటికి కొత్త కేసుల నమోదు 99 శాతం తగ్గిపోనుంది. మొత్తంగా జూలై 25వ తేదీనాటికి కరోనా నుంచి భారత్కు విముక్తి లభిస్తుందని పరిశోధకులు అంచనావేశారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా మే 29 నాటికి కొత్త కేసుల నమోదు 97 శాతం తగ్గిపోతుందని వారు పేర్కొన్నారు. జూన్ 16 నాటికి 99 శాతం, డిసెంబర్ 8నాటికి వంద శాతం కేసులు తగ్గిపోతాయని అంచనావేశారు. ఇక అమెరికాలో వచ్చే నెల 11 నాటికి కొత్త కేసుల నమోదు 97శాతం తగ్గిపోతుందని అంచనావేశారు. అదే నెల 23 నాటికి 99 శాతం, ఆగస్టు 26 నాటికి పూర్తిగా వైరస్ నుంచి అగ్రరాజ్యానికి పూర్తిస్థాయిలో విముక్తి లభిస్తుందని సింగపూర్ పరిశోధకులు వివరించారు.