తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఒక్కొక్క జిల్లా కరోనా రహిత జిల్లాలుగా మారుతున్నాయి. తాజాగా.. సంగారెడ్డిని కరోనా రహిత జిల్లాగా మార్చినట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో ఇటీవల పాజిటివ్ వచ్చిన ఎనిమిది మందికి చికిత్స తర్వాత నెగిటివ్ వచ్చిందన్నారు. నిజానికి.. కేంద్ర ప్రభు త్వం సంగారెడ్డి జిల్లాను రెడ్జోన్గా ప్రకటించగా, ప్రస్తుతం బాధితులందరూ కోలుకోవడం,కొ్త్త కేసులు నమోదు కాకపోవడంతో కరోనారహిత జిల్లాగా మారిందని ఆయన అన్నారు. నిన్న సంగారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు సదాశివపేట, జహీరాబాద్ పట్టణాల్లో హరీశ్రావు పర్యటించారు. సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని పీఎస్ఆర్ గార్డెన్లో పట్టణ పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు, సదాశివపేటలో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులతోపాటు నిత్యావసరాలను అందజేశారు.
జహీరాబాద్లో ఆశ కార్యకర్తలకు పౌష్టికాహారం కిట్లను పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి కట్టడికి పారిశుద్ధ్య కార్మికులు కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. ఏడున్నర లక్షల మంది వలస కూలీలకు రూ.500 నగదు, 12 కిలోల చొప్పున బియ్యాన్ని ప్రభుత్వం అందజేసిందన్నారు. అలాగే.. సూర్యాపేట జిల్లాలోనూ గత ఐదురోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కరీంనగర్ జిల్లాలోనూ కేసులు నమోదు కావడం లేదు. దీంతో ఆయా జిల్లాల ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.