సాధారణ ఎస్ రకం కరోనా కంటే.. ఎల్ రకం కరోనా వైరస్ ఎంతో ప్రమాదకరమట. చైనాలోని వుహాన్ నగరంలో ఎల్ రకం కరానా లక్షణాలనే గుర్తించారు పరిశోధకులు.. ఎల్రకం కరోనా ప్రభావం ఎక్కడ ఎక్కువగ ఉంటే.. అక్కడ మరణాలు అధికంగా సంభవించే ప్రమాదం ఉంటుందట. ఇప్పుడు భారత్లో కూడా కొన్ని ప్రాంతాల్లోనే అధికంగా మరణాలు సంభవించడానికి ఎల్ రకం కరోనానే కారణమని పలువురు వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. ఇక భారతదేశంలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 1,975 కొత్త కరోనావైరస్ కేసులు, 47 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 26,917 కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మొత్తం మరణాల సంఖ్య 826కు చేరుకుంది. దేశంలోని కరోనావైరస్ రోగుల రికవరీ రేటు 22 శాతానికి పెరిగిందని, 10 రోజుల క్రితం వరకు నమోదైన 12 శాతం రేటు నుండి 10 శాతం పాయింట్లు పెరిగాయని ప్రభుత్వ అధికారులు చెప్పారు. నిన్నటి వరకు మొత్తం 6,25,309 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపింది. అయితే.. మహారాష్ట్రలోని ముంబై, ఇండోర్, ఢిల్లీ, గుజరాత్ తదితర ప్రాంతాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతాల్లో ఎల్ రకం కరోనా ప్రభావం ఉందేమోనని వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు.