వెర్రి వేయి రకాలంటారు..! కరోనా వైరస్కు సంబంధించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించడం కంటే.. భయాందోళన కలిగించే అంశాలనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఓ యువకుడు మరో వెర్రివేషం వేశాడు.. ఎవరైనా వాట్సప్ స్టేటస్గా మంచి అందమైన ఫొటోనే.. ఏదైనా మంచి నినాదమో.. ఏదో ఒకటి వాడుతుంటారు. కానీ..ఓ యువకుడు ఏకంగా కరోనా రోగి ఫొటోను స్టేటస్గా పెట్టుకున్నాడు. దీంతో ఆ యువకుడిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. విజయపుర జిల్లాకు చెందిన బాలిక ఫొటోను అనిల్ రాథోబ్ (24) అనే యువకుడు తన వాట్సప్ స్టేటస్గా పెట్టాడు. ఈ విషయం కాస్త పోలీసులకు చేరింది. వెంటనే రంగంలోకి దిగారు.
బాధితురాలి పరువు తీయడం, ప్రజల్లో భయాన్ని కలిగించడానికి ప్రయత్నించాడంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. నిజానికి.. కరోనా సోకిన వారి పేర్లను బయటకు వెల్లడించొద్దు.. కనీసం లక్షణాలు కనిపించినా కూడా వారి వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు అధికారులు. కేవలం ఆ ప్రాంతాన్ని మాత్రం చెప్పే అవకాశం ఉంటుంది. కానీ.. ఇవ్వన్నీ మరిచిన ఆ యువకుడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు..!