ఓ వైపు కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కోరలుచాస్తోంది.. పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగింది. ప్రజలందరూ తీవ్ర భయాందోళనతో ఉన్నారు. ఇక నంద్యాల మండలం పొన్నాపురం గ్రామ సచివాలయ ఉద్యోగులు మాత్రం బర్త్డే పార్టీల పేరుతో తెగ ఎంజాయ్ చేశారు. లాక్డౌన్ నిబంధనలను పక్కన పడేసి గ్రామ సచివాలయంలోనే ఏకంగా డ్యాన్సులు చేశారు. మొత్తం 9మంది ఉద్యోగులు డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. అయితే.. ఆ వీడియో ఇప్పటిది కాదని పలువురు ఉద్యోగులు అంటున్నారు. గత జనవరి 19వ తేదీన తొలి జీతం తీసుకున్న సందర్భంగా ఆనందంతో చేసిన డ్యాన్స్ అని పంచాయతీ కార్యదర్శి చెబుతున్నారు.
ఏది ఏమైనా.. ఈ మీడియోపై ఉన్నతాధికారులు చాలా సీరియస్గా ఉన్నారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వరకు ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదో సందర్భంగా జరిగిన ఘటనల వీడియోలను కూడా కరోనాకు లింకుపెడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఈ సచివాలయ ఉద్యోగుల డ్యాన్స్ వీడియోకు సంబంధించి ఏం తేలుతుందో చూడాలి మరి.