కరోనా వైరస్ను కట్టడిచేయడంలో.. అప్రమత్తంగా ఉండడంలో ఏపీయే టాప్ అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అడుగడుగునా అప్రమత్తంగా ఉంటూ వైరస్ వ్యాప్తి నిరోధానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. దేశంలోనే అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు ఏపీలో జరుగుతున్నాయని ఆయన తెలిఆరు. ప్రతీ రోజు 5వేలకుపైగా పరీక్షలు చేస్తున్నామని, ఇప్పటివరకు 74555 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని ఆయన తెలిపారు. అందుకే వైరస్ బారినపడకుండా సుమారు 86శాతం రాష్ట్రం గ్రీన్ జోన్లోనే ఉందని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ప్రతీ పదిలక్షల జనాభాకు 1396 పరీక్షలు ఏపీలో చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇందులో కేవలం 1.61శాతం మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయని ఆయన తెలిపారు. సోమవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడిన ఆయన కీలక విషయాలను వెల్లడించారు. ఇప్పటికే మూడుసార్లు కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించామని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 676 మండలాలు ఉన్నాయని, ఇందులో 63 రెడ్జోన్లో ఉన్నాయని, 53 మండలాలు ఆరెంజ్ జోన్లో ఉన్నాయని, మిగతా 559 మండలాలు గ్రీన్జోన్లో ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. క్వారంటైన్ సెంటర్లలో అన్నివసతులు కల్పించామని, 9 వీఆర్డీఎల్ ల్యాబ్లు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. అదేవిధంగా 44 ట్రూనాట్ ల్యాబ్లు కూడా ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రధానంగా గ్రామ వలంటీర్లు చాలా గొప్పగా పనిచేస్తున్నారంటూ వారికి హ్యాట్పప్ చేప్పారు. 14410 టెలీ మెడిసిన్ సెంటర్లను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఆర్థిక లోటు ఉన్నా.. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.