కరోనా వైరస్ కట్టడిలో ఏపీ ముందంజలోనే ఉందని, 86శాతానికిపైగా రాష్ట్రం గ్రీన్ జోన్లోనే ఉందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. సోమవారం సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఏపీ దేశంలోనే ఆదర్శంగా ఉందంటే.. దానికి వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు, పారిశుధ్య కార్మికులు, గ్రామ వలంటీర్లు, ఆశావర్కర్లు, పోలీసులే కారణమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వారి కృషి వల్లే ఈరోజు ఏపీ సేఫ్జోన్లో ఉందని ఆయన అన్నారు. విలేకరుల సమావేశంలో పలు విషయాలను వెల్లడిస్తూనే మధ్యమధ్యలో వైద్యులు, నర్సులు, వలంటీర్లు, పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తు చేస్తూ వారికి హ్యాట్సప్ చేశారు. ప్రధానంగా గ్రామ వలంటీర్లు, ఆశావర్కర్ల సాయంతోనే ఏపీలో ఇప్పటివరకు మూడుసార్లు కుటుంబ సమగ్ర సర్వే చేపట్టామని ఆయన వెల్లడించారు.
అంతేగాకుండా.. మంచి డాక్టర్లు ఉండడం వల్లే.. బాధితులకు నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని ఆయన కొనియాడారు. ఇదేసమయంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూసించారు. కరోనా మహమ్మారి ఇప్పట్లో మనల్ని విడిచిపెట్టే అవకాశం లేదని, దానితో మనంచాలా కాలం కలిసి జీవించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అందుకే ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ.. సామాజిక దూరం పాటిస్తూ.. మాస్క్ ధరించడం ఒక్కటే మార్గమని అన్నారు. ఇళ్లలోనే ఉండేవారికి కరోనా వైరస్ వచ్చే అవకాశం చాలా తక్కువ అని ఆయన చెప్పారు.