టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..! అభిమానులకు పండుగతెచ్చే కొత్త ముచ్చట తెలుస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జునతో మల్టీస్టారర్ను తెరకెక్కించేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతన్నట్లు తెలుస్తోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ మేరకు కసరత్తు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి.. ఈ ముగ్గురికి కలిసి మల్టీస్టారర్ చేయాలని చాలా ఏళ్లుగా రాఘవేంద్రరావు ప్రయత్నం చేస్తున్నారట. అందుకోసం ‘త్రివేణి సంగమం’ అనే టైటిల్ను కూడా ఆయన అనుకున్నారట. తన 100వ చిత్రంగా దీన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్నట్లు టాక్. అంతేకాదు ఈ మూవీకి తన కుమారుడు ప్రకాష్ కోవెలమూడిని దర్శకుడిగా పెట్టి ఆయన నిర్మించాలనుకున్నారట.
కానీ కొన్ని కారణాల వలన ఈ మల్టీస్టారర్ ఆలోచనకే పరిమితమైపోయింది. ఆ తర్వాత తన వందో చిత్రంగా అల్లు అర్జున్ను హీరోగా పరిచయం చేస్తూ గంగోత్రిని తెరకెక్కించాడు రాఘవేంద్రరావు. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ చిరు, వెంకటేశ్, నాగార్జునతో మల్టీస్టారర్ సినిమా తీసేందుకు రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. రాఘవేంద్రరావు కథను తయారు చేస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈసారైనా ఆయన ప్రయత్నం ఫలిస్తే.. ఇక సంచలనమే. అభిమానులకు పండుగేమరి. ఇదిలా ఉంటే 2017లో నాగార్జునతో ఓం నమో వేంకటేశాయ చిత్రాన్ని తెరకెక్కించిన రాఘవేంద్రరావు ఆ తరువాత మరో ప్రాజెక్ట్ను ప్రకటించలేదు.