హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో కరోనా బాధితులకు ప్లాస్మా చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా తీవ్రంగా ఉన్న రోగులకు ఈ ప్లాస్మా చికిత్స ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పటికే గాంధీ దవాఖానలో కరోనాకు చికిత్స పొంది 332 మంది డిశ్చార్జి అయ్యారు. వీరిలో 32 మంది ముస్లింలు కోవిడ్తో పోరాడుతున్న ఇతరులకు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వచ్చారు. కాగా వీరందరి నుంచి వైద్యులు ప్లాస్మా సేకరించనున్నారు.
ఈమేరకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఐటీ మంత్రి కేటీఆర్కు ఓ లేఖ రా శారు. కరోనా వైరస్ సోకి కోలుకున్న 32 మందిని ప్లాస్మా దానం చేయాల్సిందిగా తాను స్వయంగా కోరినట్లు తెలిపారు. దానికి వారు సుముఖత వ్యక్తం చేశారని, వారి వివరాలను ప్రభుత్వానికి అందచేస్తున్నా అని పేర్కొన్నారు. జమాత్ చీఫ్ మౌలానా సైతం ఫాస్మా దాన కార్యక్రమానికి కరోనా నుంచి కో లుకున్న ముస్లింలు ముందుకు రావాలంటూ రంజాన్ సందర్భంగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.