సమాజంలో విలువలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. పంతాలు... పట్టింపుల కోసం మనుష్యులు ఎంతకు అయినా దిగజారుతున్నారు. తాజాగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి. ఓ యువతికి తెలియకుండానే అబార్షన్ ఘటనలో పోలీసులు వైద్యుడి సహా మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చోటుచేసుకుంది.
భద్రాద్రి జిల్లాలోని పాల్వంచకు చెందిన యువతి రెండేళ్లక్రితం కొత్తగూడెంకు చెందిన యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరు కొద్ది రోజులుగా ప్రేమించుకుని ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఇక ఇప్పుడు తమ కుమార్తె గర్భవతి కావడంతో యువతి తల్లితో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆమెను సీమంతం పేరుతో ఇంటికి తీసుకు వచ్చారు.
వీరు యువతికి తెలియకుండా ఈ నెల 22వ తేదీన తీసుకువచ్చి భద్రాచలం ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్ చేయించారు. యువతి భర్త ఫిర్యాదు మేరకు అబార్షన్ చేసిన వైద్యుడు, చేయించిన తల్లి, అమ్మమ్మపై పోలీసులు కేసు నమోదు చేశారు.