తిరుమల శ్రీవారి దర్శనాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఖండించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమని టీటీడీ పేర్కొంది. తిరుమల శ్రీ వారి ఆలయంలో జూన్ 30 వతేదీ వరకు.. భక్తులకు దర్శనం నిలిపి వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని.. అయితే అదంతా అవాస్తమని టీటీడీ వెల్లడించింది. భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించే విషయంపై ధర్మకర్తల మండలి సకాలంలో తగు నిర్ణయం తీసుకుంటుందని టీటీడీ తెలిపింది.
ఇలాంటి అవాస్తవ ప్రచారం చేస్తున్న వారి మీద టీటీడీ యాజమాన్య చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని టీటీడీ వెల్లడించింది. కాగా, కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా టీటీడీ భక్తుల దర్శనాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే.. దీనిని ఆసరాగా తీసుకున్న కొందరు టీటీడీపై తప్పుడు ప్రచారానికి తెరలేపారు. ఏకంగా జూన్ 30వ తేదీ వరకు దర్శనం నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించిందంటూ సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తుండగా.. టీటీడీ ఖండించింది.