ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు కరోనాకు విరుగుడు కనిపెట్టేందుకు శతవిధాలా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే చైనా, తదితరు దేశాలు ట్రయల్స్ కూడా చేస్తున్నాయి. అయితే.. భారత్లో కూడా వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాలు జోరుగానే సాగుతున్నాయి. ప్రముఖ వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా కీలక ప్రకటన చేశారు. భారత ప్రజలకు కరోనా వ్యాక్సిన్ను వెయ్యి రూపాయలకే అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి రెండు నుంచి నాలుగు కోట్ల డోసులను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మేలో వ్యాక్సిన్ ఔషధ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ కోసం సెప్టెంబర్లో నిర్వహించబోయే ట్రయల్స్ కోసం తాము వేచి చూడట్లేదని పూనావాలా పేర్కొన్నారు.
సొంత వ్యయంతో, రిస్కుకు లోబడి మాకు మేముగా ట్రయల్స్ను నిర్వహించి.. వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించాలనుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ట్రయల్స్ విజయవంతమైతే మొదటి ఆరు మాసాలు నెలకు నలభై నుంచి యాభై లక్షల డోసులను, ఆతర్వాత క్రమంగా నెలకు కోటి డోసులను ఉత్పత్తి చేస్తామని, ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 1,140 కోట్లను వెచ్చిస్తున్నామని ఆయన తెలిపారు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే..ఈ ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన దేశంగా భారత్ నిలిచే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.