కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కొనసాగుతున్న లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఏపీ సర్కార్ అనేక చర్యలు తీసుకుంటోంది. పేదలు ఆకలితో అలమటించొద్దన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ ముందుకు వెళ్తున్నారు. ఓ వైపు కరోనా మహమ్మారికి తరిమికొట్టేందుకు పకడ్బందీగా ప్రణాళికాబద్దంగా కార్యాచరణ చేపడుతూనే మరోవైపు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందుచూపుతో వ్యవమరిస్తున్నారు. అడుగడుగునా ప్రజలను ఆదుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల ఉచిత రేషన్ సరుకులను పంపిణీ చేయగా బుధవారం నుంచి వచ్చే నెల 10 వరకు మూడో విడత కింద ఉచిత రేషన్ సరుకులను అందించనుంది. రాష్ట్రంలో ఈసారి మొత్తం 1.48 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మొదటి విడతలో మార్చి 29 నుంచి, రెండో విడతలో ఈ నెల 16 నుంచి సరుకులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
ఈసారి కూడా రేషన్ కార్డులో పేరున్న ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యంతోపాటు ప్రతి కార్డుకు కిలో కందిపప్పును ఉచితంగా అందించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సరుకులు రేషన్ షాపులకు చేరుకున్నాయి. కాగా, ప్రస్తుతం మూడో విడత సరుకులు తీసుకునేందుకు మొత్తం 1,48,05,878 మందిని అర్హులుగా తేల్చినట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. బియ్యం పంపిణీపై అన్నివర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.