తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఓ క్లారిటీ వచ్చింది. నిజానికి.. లాక్డౌన్ కంటే ముందే పదోతరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ విధించడంతో మధ్యలోనే పరీక్షలను నిలిపివేశారు. దీంతో అప్పటి నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తాజాగా.. పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ సెక్రటరీ చిత్రా రమచంద్రన్ క్లారిటీ ఇచ్చారు. నిన్న కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై చర్చించారు.
తెలంగాణలో ఇప్పటికే ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తి అయ్యాయని, లాక్డౌన్ ముగియగానే పదోతరగతి పరీక్షలు కూడా నిర్వహిస్తామని చిత్రా రామచంద్రన్ తెలిపారు. అంటే.. మే చివరివారంలో నిర్వహిస్తారా..? లేక జూన్లో నిర్వహిస్తారా..? అన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల వరకు అందరీని పై తరగతులకు ప్రమోట్ చేస్తూ రాష్ట్రమంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.