ఏపీలో కొద్దిరోజులుగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతీరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. రెండుమూడు రోజులుగా 80కి తగ్గకుండా కొవిడ్-19 కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న ఒక్కరోజే ఏకంగా 82కొత్త కేసులు నమోదు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1259కి చేరింది. అయితే.. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్లో తొలి 603 కొవిడ్-19 కేసులు నమోదు కావడానికి 38రోజులు పడితే.. ఈ పది రోజుల్లోనే మరో 659 కేసులు నమోదు కావడంతో సంఖ్య సర్రున ఎగబాకింది. ఇక ఈ మూడు రోజుల్లో 243మంది కరోనా వైరస్ బారినపడడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఒక్క కర్నూలు జిల్లాలోనే కొవిడ్-19 కేసుల సంఖ్య ఏకంగా 300కు చేరుకుందంటే వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చునని విశ్లేషకులు అంటున్నారు. కర్నూలు తర్వాత గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ మూడు జిల్లాల్లో అధికారులు మరింత కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ మరొక ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. ఇన్నిరోజులూ సేఫ్గా ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కూడా వైరస్ బారినపడే ప్రమాదం ఉందని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.